ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యధాతథంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హూజూరాబాద్ నియోజకవర్గంతో కూడా సంపూర్ణంగా అమలవుతోందని చెప్పారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో 100 మందికి దళిత బంధు ఇస్తామన్నారు. ఏ బ్యాంకు బాదరబందీ లేకుండా, తిరిగి చెల్లించేటువంటి కిస్తీల కిరికిరి లేకుండా.. ఇచ్చే డబ్బుతో దళితులు పైకి రావాలన్నదే పథకం యొక్క ఉద్దేశం అని తెలిపారు. ప్రపంచలోనే ఇలాంటి పథకం ఎక్కడా లేదని, అణగారిన జాతులను ఆదుకోవడానికి రాష్ట్రంలో గొప్ప ప్రయత్నం జరుగుతుందన్నారు. తరతరాలు దోపిడికి గురైన జాతిని ఆదుకోవాలన్నదే తమ తాపత్రయమన్నారు. హుందాతనం ఉంటే ఇంత మంచి పనిలో కేంద్రం భాగస్వామి అవ్వాలన్నారు. ఇది వచ్చే మార్చి నెల వరకు అమలవుతుందని తెలిపారు.
దళిత బంధు పథకంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని… బండి సంజయ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకం అమలు కోసం రూ. 2 వేల కోట్లు విడుదల చేశామని మరోసారి గుర్తుచేసిన సీఎం కేసీఆర్.. పథకంపై అవగాహన కల్పించి, శిక్షణ ఇస్తున్నాం అన్నారు.. ఇక, దళితులకు అన్నింట్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నాం అన్నారు.
వచ్చే ఏడాది దళిత బంధు కోసం 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని వెల్లడించిన సీఎం కేసీఆర్.. వచ్చే మార్చిలోపు 20 లక్షల కుటుంబాలకు అమలు చేస్తాం.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొద్ది అన్ని కుటుంబాలకు వర్తింపజేస్తూ వస్తాం.. నాలుగైదు సంవత్సరాల్లో అందరికీ దళిత బంధు అందేలా చూస్తాం అన్నారు సీఎం కేసీఆర్.