![H3N2 Influenza Virus](https://brighttelangana.com/wp-content/uploads/2023/03/H3N2-Influenza-Virus.jpg)
H3N2 Influenza Virus : కరోనా నుంచి బయటపడి హమ్మయ్య అనుకుంటున్న సమయంలో కొత్త వైరస్ జనాలను వణికిస్తోంది. దేశంలో ప్రమాదకర స్థాయిలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇది సాధారణ ఫ్లూయే అయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా స్థాయిలో ప్రమాదకరం కాకపోయినా హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా (H3N2 Influenza Virus) ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. పండుగల సీజన్ వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
చలి కాలం నుంచి వేసవిలోకి ఎంటర్ అవుతున్నాం. మామూలుగా మార్చి మధ్యలో ఎండలు పెరుగుతాయి. అయితే, ఇప్పుడు మాత్రం రివర్స్ గా కనిపిస్తోంది. ఫిబ్రవరి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. పొద్దంతా ఎండ, రాత్రయితే చలి. వాతావరణంలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వేసవి ప్రవేశిస్తున్న సమయంలో దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్ జ్వరాల బారిన పడటం కలవర పెడుతోంది. కరోనా తరహా లక్షణాలున్న ఈ వ్యాధులకు ఇన్ ఫ్లూయెంజా A ఉపరకం H3N2 వైరస్ ప్రధాన కారణం అని ఐసీఎంఆర్ ఇప్పటికే గుర్తించింది. ప్రాణాంతకం కాకపోయినా ఈజీగా తీసుకునే పరిస్థితి లేదని, అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
H3N2 వైరస్ కారణంగా శ్వాస కోశ వైరల్ ఇన్ ఫెక్షన్ వస్తోంది. నిజానికి ఈ వైరస్ 1968లోనే మనుషుల్లో బయటపడింది. H3N2 అనేది.. ఇన్ ఫ్లూయెంజా A వైరస్ యొక్క రెండు ప్రోటీన్ జాతుల కలయిక. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ల నొప్పులు, తుమ్ములు, తలనొప్పి, చలి, గొంతులో గరగర, ముక్కు కారడం, అలసటి, అతిసారం, వాంతులు, ఊపిరి ఆడకపోవడం వంటివి ఈ వైరస్ లక్షణాలు.
కరోనా తరహాలోనే ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇంట్లో ఒకరికి వస్తే మిగతా వారికి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను కలిసి వారి సూచన మేరకు మందులు వేసుకోవాలి. ఒకవేళ కేవలం జలుబు, దగ్గు ఉంటే.. మొదటి రెండు మూడు రోజులు వేచి చూడొచ్చు. జ్వరం, విరేచనాలు మొదలైతే మాత్రం వెంటనే డాక్టర్ ను కలవాలని నిపుణులు సూచిస్తున్నారు.
దేశవ్యాప్తంగా జ్వరం, ఫ్లూ కేసుల పెరుగుదల కనిపిస్తోంది. రెండు మూడు నెలలుగా ఫ్లూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కరోనాకు, ఇన్ ఫ్లూయెంజా వైరస్ (Influenza Virus)కు సంబంధం ఉందా? అనే భయాలు జనాల్లో వినిపిస్తున్నాయి. అయితే, రెండూ ఒకే రకమైన లక్షణాలు కలిగున్నాయని, రెండు వైరస్ ల ప్రభావం రెండు మూడు నెలలు ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇన్ ఫ్లూయెంజా శాంపిల్స్ ను కూడా కోవిడ్ పరీక్షలకు తరలిస్తున్నారు.
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం అని అనుకుంటున్న సమయంలో కొత్త వైరస్ ఇప్పుడు మరింత టెన్షన్ పెడుతోంది. హైదరాబాద్ లో జ్వరాల కేసులు భారీగా పెరిగాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇన్ ఫ్లూయెంజా వైరస్ ప్రాణాంతకం కాదని, శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నవారు మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. అదే సమయంలో వైరస్ విషయంలో అజాగ్రత్తగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.