![Ayyappa Devotees Protest](https://brighttelangana.com/wp-content/uploads/2022/12/Ayyappa-Devotees-Protest.jpg)
Ayyappa Devotees Protest : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రేంజర్లలో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అయ్యప్ప స్వామి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేశ్ తో కలిసి సభలో పాల్గొన్న అంబేద్కర్ సంఘం నేత రాజేశ్ ఇంటిని అయ్యప్ప భక్తులు ముట్టడించారు.
రాజేశ్ ను తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న అయ్యప్ప స్వాములపై సుమన్ అనే వ్యక్తి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. సమీప గ్రామాల నుంచి అయ్యప్ప భక్తులు రేంజర్లకు తరలి రావడంతో భారీగా పోలీసులను మోహరించారు.
రెండు రోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన అంబేద్కర్ సభలో ఓయూ విద్యార్థి, భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేశ్.. అయ్యప్ప స్వామిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో తెలంగాణ వ్యాప్తంగా వైరల్ కావడంతో అయ్యప్పస్వామి భక్తులు, హిందూ సంఘాల నేతలు నరేశ్ పై మండిపడుతున్నారు. మేం నాస్తికులం.. దేవుడిని నమ్మం.. అంబేడ్కర్ సభ అంటేనే నాస్తికుల సభ అని బహిరంగంగానే దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నరేశ్. అయ్యప్ప స్వామి జననాన్ని, పురాణాన్ని కించపరుస్తూ కారుకూతలు కూశాడు.
ఎంతోమంది నమ్మకంగా కొలిచే అయ్యప్పస్వామిని నరేశ్ మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై అయ్యప్పస్వాములు ఆందోళనకు దిగారు. భైరి నరేశ్ ను వెంటనే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్లను తిట్టడం ప్రతోడికి ఫ్యాషన్ గా మారిందని, హిందువుల దేవుళ్లను దూషిస్తే బాగా పబ్లిసిటీ వస్తుందని కొందరు ఇలా దిగజారిపోతున్నారని అయ్యప్ప భక్తులు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే హిందూ సమాజం ఏకం కావాలన్నారు. దేవతల గురించి తప్పుగా మాట్లాడిన వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు.