Bright Telangana

గుడ్‌న్యూస్‌..ఇక మొబైల్‌ స్క్రీన్‌ గ్లాస్‌ అస్సలు పగలదు!

మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎంత ఖరీదైన ఫోన్‌ అయిన కింద పడిందంటే చాలు స్క్రీన్‌ గ్లాస్‌ పగలడం ఖాయం. అయితే ఇకపై ఈ ప్రోబ్లమ్‌ ఉండదు. అత్యంత గట్టిగా ఉండి ఒత్తిడి తట్టుకునే సరికొత్త గాజు త్వరలోనే అందుబాటులోకి వస్తోంది. కెనడాకు చెందిన మెక్‌గిల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. సాధారణ గాజును, ఆక్రిలిక్‌ను కలిపి ఈ సరికొత్త గాజును రూపొందించారు. సాధారణ గాజుతో పోలిస్తే ఇది 5 రెట్లు ఎక్కువ ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉంటుందని చెబుతున్నారు.

ఆల్చిప్పల్లో ముత్యాలు రూపొందే పద్ధతి ఆధారం గానే ఈ స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ గ్లాస్‌ను తయారు చేశారు. ఆల్చిప్పల లోపలి వైపు నెక్ర్‌గా పిలిచే పదార్థం ఉంటుంది. పెళుసుగా ఉండే కాల్షియం కార్బోనేట్‌ పదార్థం, సాగే గుణమున్న ఆర్గానిక్‌ పదార్థం కలిసి ‘నెక్ర్‌’గా రూపొందుతాయి. దీనితో రూపొందే ఆల్చిప్పలు, ముత్యాలు దృఢంగా ఉంటూనే.. ఒత్తిడిని తట్టుకునే శక్తి కలిగి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నిర్మాణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. పెళుసుగా ఉండే గాజును, సాగే గుణమున్న ఆక్రిలిక్‌ను కలిపి దృఢమైన గ్లాస్‌ను రూపొందించారు. దీని తయారీ చాలా సులువని, ధర కూడా తక్కువే ఉంటుందని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లతోపాటు టీవీలు, మానిటర్లు వంటివాటికి ఈ గాజును వినియోగించవచ్చని చెబుతున్నారు.