గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం రోజు లీటర్ పెట్రోల్ పై 31 పైసలు,డీజిల్ పై 38 పైసలు పెరిగాయి. దీంతో వాహనదారులు పెరుగుతున్న ఇంధన ధరలతో చేతి చమురు వదులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం దారుణమని వాపోతున్నారు. ఇంట్లో నుండి వాహనం తీయాలంటే భయం వేస్తుందని అంటున్నారు. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.73కి చేరింది. డీజిల్ కూడా సెంచరీ కొట్టి మరింతగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర రూ. 100.51గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీలో చేర్చాలని చాలా రోజులుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఇంధన ధరలను జీఎస్టీలో చేర్చేందుకు పలు రాష్ట్రాలు అంగీకరించడం లేదని కేంద్రం తెలిపింది. ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. పెట్రోల్ రేటు రూ.75-80కి దిగొస్తుంది. అదే జరిగితే.. సామాన్య ప్రజలకు ఊరట కలుగుతుంది. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్ల ధరలు సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి.