ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పారదర్శకంగా జరగాలని.. అంతేకాకుండా నవంబర్ 30వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కోవిడ్–19 నియంత్రణ, నివారణా చర్యలు, వ్యాక్సినేషన్పై సమీక్ష జరిపారు. జాతీయ ప్రమాణాలను అనుసరించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం, జిల్లా ప్రధాన కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్హబ్స్ ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్షించారు. జాతీయ ప్రమాణాలను అనుసరించి పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకంపై సమీక్ష జరిపారు.
విద్యుత్పై సీఎం సమీక్ష..
సీఎం జగన్ రాష్ట్రంలోని విద్యుత్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన అనంతరం థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. సీలేరు సహా ప్రాజెక్టుల సాకారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని 50 మిలియన్ యూనిట్ల నుంచి 69 మిలియన్ యూనిట్లకు పెంచామని సీఎం జగన్ అధికారులు వివరించారు. సింగరేణి సహా కోల్ ఇండియా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పులను వినియోగించుకునే ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచన చేయాలని అన్నారు. దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని అన్నారు.
170 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి..
కాగా, పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి 170 మెగావాట్ల విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తోందని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలని సీఎం ఆదేశించారు. 6300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలని సూచించారు.ఈ ప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.