హుజురాబాద్ ప్రజలు తమ ఓపీనియన్ను చెప్పే టైం వచ్చింది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొని సర్వసన్నద్ధమయ్యారు. నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో 306 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 891 ఈవీఏంలు, 515 వీవీ ప్యాట్స్ సిద్దం చేశారు అధికారులు. 17వందల 50 మంది పోలింగ్ విధుల్లో ఉంటారు. 3 వేల 865 మంది పోలీస్ సిబ్బందితో పాటు 25 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాటు చేశారు. 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని సూచించారు. రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తి అయిన ఉద్యోగులకే ఎలక్షన్ డ్యూటీ వేశామన్నారు అధికారులు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 306 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంపిక చేశారు అధికారులు.
ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు లక్షా 19వేల 102మంది, పురుషులు లక్షా 17వేల 993మంది ఉన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నర్సింగారావు, మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని ఓటర్లు శనివారం ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఓటింగ్ పూర్తికాగానే ఈవీఎంలను, వీవీ ప్యాట్లను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలకు తరలిస్తారు. వీటిని భద్రపరిచేందుకు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. నవంబరు 2న ఇక్కడే ఓట్ల లెక్కింపు జరగనున్నది.