Itlu Maredumilli Prajaneekam Movie Trailer : అల్లరి మూవీతో కామెడీ హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు అల్లరి నరేష్. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిర్మాతల ఫేవరేట్ హీరోగా నిలిచిన నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ మృతి చెందాకా కొద్దిగా సందిగ్ధంలో పడ్డాడు. ఆ తరువాత కామెడీ కథలను, రొట్ట కామెడీని నమ్ముకుంటే ప్రజలు చూడరని అర్ధం చేసుకొని వైవిధ్యమైన కథలతో ముందుకు రావడం మొదలుపెట్టాడు. మహర్షి లో కీలక పాత్రలో నటించి మెప్పించిన నరేష్.. నాంది మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికాడు.
ఈ మూవీ తరువాత నరేష్ నటిస్తున్న వైవిధ్యమైన మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని హాస్య మూవీస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో నరేష్ సరసన ఆనంది నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘మరో నాలుగు రోజుల్లో ఎలక్షన్స్ మీ ఊరిలో జరగబోతున్నాయి’ అంటూ నరేష్ చెప్తున్న డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. ట్రైలర్ ను బట్టి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచానికి సంబంధం లేని మారేడుమిల్లి అనే ఒక చిన్న పల్లెటూరులో ఓటుపై అవగాహాన కల్పించడానికి వచ్చిన అధికారి అక్కడ ఓటు వేసినా.. రాజకీయ నేతలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ ప్రజలను పట్టించుకోరని తెలిసి అతడే పోరాటానికి దిగుతాడు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలబడతాడు. కానీ, ప్రభుత్వ ఉద్యోగి అయిన సంపత్, రాజకీయ నేతలతో చేతులు కలిపి ఆ గ్రామాన్నే లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు.
ఈ పోరాటంలో నరేష్ ప్రజలను గెలిపించాడా..? చివరకు అతను ప్రాణాలు కోల్పోయాడా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓటు విలువ, ఓటు కోసం రాజకీయ నాయకులు చేసే పనులను చూపించే ప్రయత్నం చేసినట్టున్నాడు దర్శకుడు. ముఖ్యంగా ఓటు గురించి చెప్పే డైలాగ్స్.. చివర్లో ‘దేశం బాగుపడాలంటే ఒకటి రాజకీయ నాయకులు, రెండు ప్రభుత్వ ఉద్యోగులు మారాలి’ అంటూ నరేష్ చెప్పే డైలాగ్ ట్రైలర్ కు హైలైట్ గా నిలిచింది. ఇక నరేష్ నటన నాంది మూవీని గుర్తు చేస్తోంది. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ ఆకట్టుకొంటుంది. ఇకపోతే ఈ మూవీ నవంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీతో నరేష్ నాంది లాంటి హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.