TRS to BRS : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్ ) గా సవరించి, ఆమోదిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చాలని ఈ ఏడాది దసరా పర్వదినం రోజున సీఎం కేసీఆర్ పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1:20 నిమిషాలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ భవన్ లో రేపు (శుక్రవారం) ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖపై రిప్లై సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. తెలంగాణ భవన్ లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ముఖ్యమంత్రి కోరారు. వీరితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ పిలుపునిచ్చారు.
దేశ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ నూతన జాతీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ అధికారిక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ పేరును మారుస్తూ దసరా రోజున నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుంది. సుమారు 8 రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు అని కేసీఆర్ ఆ రోజున తీర్మాన ప్రతిని చదివి వినిపించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్చించిన ఈసీ.. త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది.