హుజురాబాద్ ఉపఎన్నికల్లో డబ్బులు పంపిణీ అన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒక ఓటుకు రూ.6 వేల చొప్పున పంపణీ చేస్తున్నట్లు వీడియో వైరల్ అయ్యింది. కమలాపూర్లో కవర్పై ఓటర్ల నెంబర్ వేసి డబ్బులు పంపిణీ చేస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. హుజురాబాద్లో సైతం ఓటర్కు రూ.6 నుంచి రూ8 వేలు పంపిణీ జరిగినట్లుగా సమాచారం. ఖర్చుకు తగ్గకుండా ఆయా పార్టీలు పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేస్తున్నట్లుగా చర్చించుకుంటున్నారు. పంపిణీకి సిద్ధంగా వున్న కవర్ల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి హుజురాబాద్ నియోజకవర్గంలో గత రెండు మూడు రోజులుగా డబ్బుల పంపిణీ జరుగుతుందనే ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పుడు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్లు ఏకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడం హాట్టాపిక్గా మారిపోయింది..
హుజురాబాద్ మండలంలోని రాంపూర్లో ఓ పార్టీకి చెందిన నేతలు.. కొంతమంది ఓటర్లకే డబ్బులు పంచారట.. మరికొంత మందికి మరిచారో మరి మళ్లీ వస్తారో తెలియదు.. కానీ, ఈలోపే ఓటర్లు నిరసనకు దిగారు.. తమకు డబ్బులు రాలేదని రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.. దీంతో, హుజురాబాద్ జమ్మికుంట రహదారి పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గ్రామంలో కొందరు ఓటర్లకు డబ్బులిచ్చి మరికొందరిని వదిలేశారని నినాదాలు చేస్తూ.. నిరసన తెలుపుతున్నారు గ్రామస్తులు. ఎన్నికల్లో డబ్బుల పంపిణీ ఓపెన్ సీక్రెటే అయినా.. ఇప్పుడు ఓటర్లు ఆందోళనకు చేపట్టడం మాత్రం చర్చగా మారింది. హుజురాబాద్ నియోజకవర్గంలో డబ్బుల ప్రవాహం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.