తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతతో ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. కోవిడ్ పేషెంట్ల, లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ సమయం ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు మాత్రమే అవకాశం ఉంది. అయితే చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే పోలింగ్ ముగిసింది.
అంతేకాకుండా ఈవీయంలకు ఎన్నికల సిబ్బంది సీల్ వేస్తున్నారు. అక్కడక్కడా చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. రాత్రి 7 గంటల వరకు 86.4 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ పోలింగ్లో చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని, మొత్తం మీద పోలింగ్ ప్రశాతంగా ముగిసిందని వెల్లడించారు. పోలింగ్ అనంతరం ఈవీయంలను కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాట చేసిన స్ట్రాంగ్ రూంకు భారీ భద్రత నడుమ తరలించనున్నారు.
ఆంధ్రప్రదేశ్: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఈ సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 281 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోంచుకున్నారు. ఈ ఉపఎన్నిక పోరులో మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్తోపాటు వెబ్క్యాస్టింగ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్ వెల్లడించారు.
బద్వేలు ఉప ఎన్నికకు 3 వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 221 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.