మెగాస్టార్ చిరంజీవి వరుస మూవీలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ మూవీని కంప్లీట్ చేసిన చిరంజీవి.. ‘గాడ్ ఫాదర్’ ‘భోళా శంకర్’ వంటి మూవీలను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో తాజాగా భోళా శంకర్ మూవీని షురూ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. నవంబర్ 11న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా నిర్వహించారు.
సోమవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్లో ప్రారంభమైంది. ఏస్ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్లో షూటింగ్ ప్రారంభమైంది. అంతే కాదు ఈ మూవీ కోసం మరికొన్నిసెట్స్ కూడా వేయనున్నారట. ఈ మూవీ చాలా భాగం సెట్స్ లో షూట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఫస్ట్ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవి పై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.
భోళా శంకర్ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ మూవీ మీద అంచనాలు పెరిగాయి. టైటిల్ పోస్టర్, రాఖీ పండుగ నాడు విడుదల చేసిన స్పెషల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. భారీ అంచనాలతో రాబోతోన్న ఈ మూవీలో చిరంజీవిని మెహర్ రమేష్ విభిన్న గెటప్స్లో చూపించబోతోన్నారు. అద్భుతమైన కథకు.. మరింత అద్భుతమైన నటీనటులు, సాంకేతిక బృందం తోడైంది. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్గా నటించనుండగా, చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. పక్కా కమర్షియల్గా ఈ మూవీ ఉండబోతోంది.
మహతి స్వర సాగర్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఈ మూవీ తెరకెక్కుతుండగా.. 2022లో భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.