Konijeti Rosaiah : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయాన్నే ఆయనకు గుండెపోటు రాగా బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మధ్యలోనే చనిపోయారు. ప్రస్తుతం రోశయ్య భౌతిక కాయాన్ని ఆస్పత్రి నుంచి అమీర్పేటలోని ఆయన ఇంటికి తరలించారు. రోశయ్య మరణం పట్ల కాంగ్రెస్తో పాటు అన్ని పార్టీలు చెందిన నేతలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన రోశయ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేకపోయారు. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారు. మంచి వక్తగా పేరుతెచ్చుకున్నాడు, అలాగే ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉంది.
2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత.. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 3 సెప్టెంబరు 2009 నుంచి 24 నవంబరు 2010 వరకు సీఎంగా పనిచేశారు. 1968, 1974, 1980, 2009లో ఎమ్మెల్సీగా ఉన్నారు రోశయ్య. 1989, 2004 ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1998లో నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు. 2011లో తమిళనాడు గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు.