టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు టాలీవుడ్ నుంచి రెండు ప్యానల్స్ పోటాపోటీగా దిగాయి.. ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు ఇద్దరూ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా ఒకరిమీద ఒకరు ఆరోపణలు గుప్పించుకునే పరిస్థితి కనిపిస్తోంది.. తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మీద తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
‘మీరు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా?’ అని మంచు విష్ణు ప్రశ్నించడం బాగోలేదని.. పవన్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ”పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని విశ్లేషించాలి. మొదట ఆయన సినీ నటుడు.. ఆ తర్వాతే రాజకీయ నాయకుడు. విష్ణు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. పవన్ మార్నింగ్ షో కలెక్షన్ అంత లేదు మీ సినిమా బడ్జెట్. ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి” అని ప్రకాష్ రాజ్ అన్నారు.
”మీకు పొలిటికల్ అజెండా ఉంటే మీరు చూసుకోండి. పవన్ కళ్యాణ్ ఓ నటుడు. ఆయన రాజకీయ అజెండా మాకొద్దు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నాకు తెలియవు. ఇండస్ట్రీ పరంగా పవన్ రెండు మూడు ప్రశ్నలు అడిగారు. అవి ఏ స్వరంతో అడిగారనే దానిపై మనం చర్చించుకుందాం. అంతేకానీ.. మీరు పవన్ కల్యాణ్ పక్కన ఉన్నారా? ఇండస్ట్రీ పక్కన ఉన్నారా?’ అంటూ నన్నెందుకు లాగుతున్నారు. ఆయనకు నాకూ సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్నాయి. పవన్ కూడా ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. కానీ సినిమా విషయానికొస్తే నేను నంద – ఆయన బద్రి. అంతే” అని చెప్పారు.
‘మా’ ఎన్నికల్లోకి జగన్ ను లాగొద్దని.. ఆయన పాదయాత్ర చేసి ప్రజల మనసు గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారని.. ‘మా’ అసోసియేషన్ గురించి ఆలోచించేంత సమయం ఆయనకు ఉండదని ప్రకాష్ రాజ్ అన్నారు. అలానే కేసీఆర్ ఉద్యమం చేసి సీఎం అయ్యారని.. ఆయనకు చాలా పనులున్నాయని.. ఇందులోకి వాళ్ల పేర్లు ఎందుకు లాగుతున్నారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.
వివాదాల మధ్య పెదవి విప్పిన పూనమ్ కౌర్.. ప్రకాష్ రాజ్ కు పూనమ్ కౌర్ మద్దతు:
మా ఎన్నికలు వాడీవేడిగా సాగుతున్న క్రమంలో ఎంటర్ అయిన పూనమ్ కౌర్ ”ప్రకాష్రాజ్ సార్ మా ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నా, ఆయన గెలిస్తే నేను ఎదుర్కొన్న సమస్యలను నేను ఆయన ముందు పెడతాను, ఇంత కాలం నిశ్శబ్దంగా ఉన్నాను కానీ అవన్నీ ఆయన ముందు పెడతానని అన్నారు. అతను మాత్రమే నిజాయితీగా ఉంటాడు. చిల్లర రాజకీయాలు చేయకుండా.. పెద్దల పట్ల గౌరవాన్ని కలిగియుండి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. జైహింద్” అని పూనమ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.