టీ 20 ప్రపంచ కప్ 2021: కీలక పోరులో వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా విజయం సాధించి సెమీస్ అవకాశాలను మెరుగు పరుచుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 16.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. మునుపటి ఫామ్ అందుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 56 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 9 ఫోర్లు ఉన్నాయి. మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 32 బంతుల్లో 53 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో హోసిన్, గేల్ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్ కీరన్ పొలార్డ్ 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ ఎవిన్ లూయిస్ 29, హెట్మెయర్ 27 పరుగులు సాధించారు. తమ కెరీర్ లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న గేల్ 15, బ్రావో 10 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజెల్ వుడ్ 4 వికెట్లు తీశాడు. స్టార్క్, కమిన్స్, జంపా తలో వికెట్ పడగొట్టారు.
గ్రూప్-1లో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఆసీస్ సెమీస్కు వెళ్లాలంటే సౌతాఫ్రికా ఓడిపోవాలి. ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిచినా తక్కువ రన్ రేట్ ఉండాలి. అలా అయితేనే ఆస్ట్రేలియా సెమీస్కు వెళ్తుంది. లేదంటే సౌతాఫ్రికా వెళ్తుంది.