Producer NV Prasad Fires on YSRCP MLA Nallapureddy : మూవీ టిక్కెట్ ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించిన వ్యవహారం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు వర్మ నిన్న జరిపిన భేటీ కూడా ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వెళ్లి భోజనం చేసి వచ్చాడంటూ రామ్ గోపాల్ వర్మను పలువురు విమర్శిస్తున్నారు. మరో మూవీ దర్శకుడు హరీశ్ శంకర్.. రామ్ గోపాల్ వర్మ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. క్యాచ్ ఔట్ అయిన తర్వాత నేరుగా పెవిలియన్ లోకి వెళ్లి కూర్చోవాలని.. గ్రౌండ్ లో డిబేట్ పెట్టొద్దని ఎద్దేవా చేశారు.
మరో వైపు పేర్ని నానితో.. రామ్ గోపాల్ వర్మ భేటీ అయిన సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మూవీ పరిశ్రమలో ఆగ్రహావేశాలను రేకెత్తించాయి. మూవీ ఇండ్రస్టీ వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరులో నల్లపురెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసని ఆయన ఎద్దేవా చేశారు. నల్లపురెడ్డి కుటుంబం అంటే అందరికీ చాలా గౌరవం ఉందని.. అనవసర వ్యాఖ్యలతో కుటుంబ గౌరవాన్ని దిగజార్చుకోవద్దని ఆయన అన్నారు.
మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన హీరో అయిపోరని.. సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ అన్నారు. బలిసి కొట్టుకుంటున్నది మూవీ ఇండ్రస్టీ కాదని.. మీరేనని అన్నారు. మూవీ ఇండ్రస్టీ వాళ్లను అమర్యాదకరంగా మాట్లాడటం సరికాదని అన్నారు. మూవీ నిర్మాణం ఎంత కష్టతరమో వచ్చి ప్రత్యక్షంగా చూడాలని చెప్పారు. తన మూవీ నిర్మాణ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డిని ఆహ్వానిస్తానని తెలిపారు. చేసిన వ్యాఖ్యలను ప్రసన్న వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.