Rythu Bandhu : తెలంగాణ ప్రభుత్వం 2018 నుండి రైతులకు వివిధ దశల్లో పెట్టుబడి సాయం అందించేందుకు ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాసంగి సీజన్లోనూ రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. డిసెంబర్ 15వ తేదీ నుండి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ పథకం ద్వారా ఒక ఎకరం ఉంటే రూ. 5వేలు రైతుల అకౌంట్లలో జమ అవుతాయి. పంటలు సాగు చేసినా.. చేయకపోయినా .. భూమి ఉన్న ప్రతీ రైతుకు ‘రైతుబంధు’(Rythu Bandhu) పథకం ద్వారా రైతుల అకౌంట్లలో జమ అవుతాయి. తెలంగాణ ప్రభుత్వం సుమారుగా రూ.7 వేల 500 కోట్లను కోటిన్నర ఎకరాలకు పంపిణీ చేయనుంది. అలాగే పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర రైతుల తరపున తమ గొంతును గట్టిగా వినిపించాలని.. చెప్పారు సీఎం కేసీఆర్.
వ్యవసాయ శాఖ వద్ద రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల నంబరు, బ్యాంకు ఖాతాలన్నీ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా పాస్ పుస్తకాలు జారీ అయితే ఏఈవోలకు వారి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత రైతులు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించే అవసరం ఉండదు. గడిచిన వానాకాలం సీజన్లో ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు మొదటి రోజు, రెండెకరాలు వరకు భూమి ఉన్న రైతులకు రెండో రోజు, మూడెకరాలు మూడో రోజు ఇలా ఆరోహణ పద్ధతిలో నగదు బదిలీ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతిని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.