టీ 20 ప్రపంచ కప్ 2021: సూపర్ 12లో నమీబియాతో నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ లో టీమిండియా గెలిచింది. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నమీబియా నిర్దేశించిన 133 పరుగుల స్వల్ప టార్గెట్ ను కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో చేజ్ చేసింది.
తొలుత బ్యాటింగ్కు దిగిన నమీబియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత శర్మ, కేఎల్ రాహుల్ శుభారంభాన్ని అందించారు.
రోహిత్ శర్మ 37 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్స్లతో 56 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 36 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్లతో 54 పరుగులతో రాణించి నాటౌట్గా నిలిచాడు. టీమిండియా రోహిత్ వికెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత క్రీజులోకొచ్చిన సూర్య కుమార్ యాదవ్ 19 బంతుల్లో 25 పరుగులు చేశాడు.
గ్రూప్-2లో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఇండియా… ఆపై వరుసగా అఫ్ఘానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లపై ఘన విజయాలు నమోదు చేసింది. అయితే సమీకరణాలు సహకరించకపోవడంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఇండియా టీ20 జట్టుకు కెప్టెన్ గా కోహ్లీకి ఇదే చివరి టోర్నీ కాగా, టీమిండియా కోచ్ గా రవిశాస్త్రికి కూడా ఇదే ఆఖరి మ్యాచ్.
ఇక, టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ దశకు తెరలేచింది. నవంబర్ 10న జరిగే తొలి సెమీస్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. నవంబర్ 11న జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.