టీ20 వరల్డ్ కప్ 2021: తొలి మ్యాచ్ లో ఇండియా పై చారిత్రాత్మక విజయం సాధించి మాంచి ఊపుమీదున్న పాకిస్తాన్.. సెకండ్ మ్యాచ్ లోనూ విజయం సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన పోరులో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 16వ ఓవర్ వరకు న్యూజీలాండ్ వైపే ఉన్నట్టుగా కనిపించిన విజయం.. ఆ తర్వాతి ఓవర్లో చేతులు మారింది. 17వ ఓవర్ వేసిన కివీస్ బౌలర్ టిమ్ సౌథీ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసి విజయాన్ని పాకిస్థాన్ ఖాతాలో వేసుకునేలా చేసింది.
135 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 87 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిందనుకున్న సమయంలో ఆసిఫ్ అలీ, పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్తో కలిసి ఇన్నింగ్స్ చక్కబెట్టి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. షోయబ్ మాలిక్ 20 బంతుల్లో 26 పరుగులు రాబట్టగా, ఆసిఫ్ అలీ 12 బంతుల్లోనే 27 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. అంతిమంగా ఈ ఇద్దరూ కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. మొత్తానికి న్యూజిలాండ్పై గెలుపుతో పాయింట్స్ టేబుల్లో పాకిస్థాన్ మరో అడుగు పైకి వేసిందనే చెప్పుకోవచ్చు.