![ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్](https://brighttelangana.com/wp-content/uploads/2021/11/pawan-kalyan-fires-on-ap-govt.jpg)
Pawan Kalyan on Ippatam Incident : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. వైకాపా రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా? మా వాళ్లను బెదిరిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని జనసే పార్టీ కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల కూల్చివేత బాధితులతో పవన్ సమావేశమయ్యారు. బాధితులకు రూ. లక్ష చొప్పున జనసేన అధినేత ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇప్పటం గ్రామస్థుల ఇళ్లను కూల్చడాన్ని నేను మర్చిపోనని, అక్కడ కూల్చిన ప్రతిదీ తన గుండెపై కొట్టినట్లే అనిపించిందని అన్నారు.
ఇప్పటంలో కక్షపూరితంగా వ్యవహరించారన్న పవన్.. ఈ కూల్చివేతల వెనుక సజ్జల ఉన్నారంటూ ఆరోపించారు. సజ్జల, వైసీపీ నేతలది ఆధిపత్యపు అహంకారం, సజ్జల డిఫ్యాక్టో సీఎం అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. నేను అన్నింటిని సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని, వైసీపీ ఉడత బెదిరింపులకు నేను భయపడనని పవన్ అన్నారు. వైసీపీ నేతలకు సంస్కారం పని చేయదని, మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అంటారు.. మీరు నాయకుల్లా ప్రవర్తిస్తే.. మేము నాయకుల్లా మాట్లాడతాం.
మీరు వీధి రౌడీల్లా వ్యవహరిస్తే అలాంటి వారికి ఎలా బుద్దిచెప్పాలో మాకు తెలుసంటూ పవన్ అన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా జనసేన స్పందిస్తుందని, నాతోటి ప్రజల ఇళ్లను అన్యాయంగా కూల్చినందునే బయటకు వచ్చానని మీరు ఓటువేసినా వేయకపోయినా మీకు అండగా నిలబడతానని ఇప్పటం బాధితులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన రౌడీ సేన అంటున్నారని.. మాది రౌడీ సేన కాదు.. విప్లవ సేన అంటూ పవన్ అన్నారు.
రాజకీయాలు మీరే చేయాలా మేము చేయకూడదా అన్న పవన్.. నేను కులాలను వేరు చేయడం లేదు, కలుపుతున్నానంటూ వ్యాఖ్యానించారు. నేను ఢిల్లీకి వెళ్లి చాడీలు చెప్పేవాడిని కాదని, వైకాపాను దెబ్బకొట్టాలంటే ప్రధానికి చెప్పి చేయనని పవన్ అన్నారు. ఇప్పటం గ్రామానికి సమస్య వస్తే ఢిల్లీ వెళ్లి అడగను, మేము తేల్చుకుంటాం. ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరు ఎలా గెలుస్తారో మేమూ చూస్తాం ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొడతాం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.