Rythu Bandhu Scheme Amount into Farmers Accounts From Today : ఈరోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు నిధులు జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు పథకం కింద పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రైతుబంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి 7 విడతల్లో సుమారు 44 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశామని మంత్రి సింగిరెడ్డి తెలిపారు. ఈ సీజన్తో కలుపుకుని మొత్తం 50 వేల కోట్ల రూపాయలు ఈ పథకం కింద, అన్నదాతల ఖాతాల్లో జమ చేయడం పూర్తవుతోందని మంత్రి తెలిపారు.
మరోవైపు, డిసెంబరు 10 నాటికి ధరణి పోర్టల్లో పట్టాదారులు, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అందిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు, ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులని ప్రకటించారు అధికారులు. ఈ యాసంగి సీజన్లో 66 లక్షల మంది రైతులుకు సంబంధించిన 7వేల 645 కోట్ల రూపాయలు జమ చేయడానికి సన్నద్ధమైనట్లు అధికారులు స్పష్టం చేశారు. ఎకరా నుంచి 2, 3, 4 ఎకరాల లెక్కన గతంలో మాదిరిగానే, ఆరోహణ క్రమంలో నిధులు జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
రైతుబంధు పథకం గొప్పదనాన్ని వివరించారు మంత్రి నిరంజన్రెడ్డి. రైతుబంధు పథకం ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాల్లో ఒకటిగా, 2018 నవంబరులో రోమ్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో AFAO ప్రశంసించిందని వివరించారు. రైతుబంధు నిధుల జమ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే, స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు.