టీ 20 ప్రపంచ కప్ 2021: టోర్నీలో ఎట్టకేలకు టీమిండియా తొలి విజయాన్ని సాధించింది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో, న్యూజిలాండ్పై 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 66 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధిచింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ తడబడింది. భారత్ ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 66 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయం సాధిచింది.
టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు, అశ్విన్ రెండు వికెట్లతో సత్తా చాటారు. అఫ్గానిస్థాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ ( 32 బంతుల్లో 35 పరుగులు), కరీమ్ జన్నత్ ( 22 బంతుల్లో 42 పరుగులు) రాణించారు.
అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా…. అఫ్ఘనిస్థాన్పై రెచ్చిపోయారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (74; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులు), కేఎల్ రాహుల్ (69; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (27; 13 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు), ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (35; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) కూడా చెలరేగారు. మొత్తానికి ఇండియా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసి.. ఆఫ్ఘనిస్థాన్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆప్ఘన్ బౌలర్లలో కరీమ్ జనత్, గుల్బాదిన్ నైబ్ చెరో వికెట్ కూల్చారు.
ఇక, ఈ మెగా టోర్నీలో టీమిండియాకు ఇదే తొలి విక్టరీ. ఈ విజయంతో తన ఆశల్ని సజీవంగా ఉంచుకుంది ఇండియా. ఒక వేళ అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్ ను ఓడిస్తే టీమిండియాకు ఛాన్స్ ఉంటుంది. అలాగే, టీమిండియా మిగతా రెండు మ్యాచుల్లో భారీ రన్ రేట్ తో గెలవాలి.