![చంద్రబాబు](https://brighttelangana.com/wp-content/uploads/2021/11/Chandrababu-Sensational-Press-Meet-లైవ్-లో-ఏడ్చేసిన-చంద్రబాబు.jpg)
ఆంధ్రప్రదేశ్ : శాసనసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర బావోద్వేగానికి గురయ్యారు. మళ్లీ సీఎం అయ్యేవరకూ ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టబోనంటూ శపథం చేసిన చంద్రబాబు ఆ తర్వాత విలేకరుల సమావేశంలో గుండెలవిసేలా విలపించారు. రెండు నిమిషాలపాటు మాట్లాడలేకపోయారు. ఏనాడూ ఇంటినుంచి బయటకు రాని భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. భువనేశ్వరి చేసిన త్యాగం గొప్పదన్నారు. ప్రతి సంక్షోభంలోనూ ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేస్తున్న వారి ఇళ్లల్లోని వారిని కూడా ఇలాగే తిడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.
కానీ గత రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని విధాలా అవమానాలు ఎదుర్కొంటున్నాను. ఈ ప్రభుత్వం మా పార్టీ నాయకులు, కార్యకర్తలను వ్యక్తిగతంగా వేధిస్తోంది. కేసుల పేరుతో బెదిరిస్తోంది. బూతులు తిడుతూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానిస్తోందని, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను అవమానించడం పరిపాటిగా మారిందన్నారు. వైసీపీ నేతలు భువనేశ్వరి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చంద్రబాబు చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ వ్యక్తిగతంగా అవమానించలేదన్నారు. రాజకీయాల్లో విలువలు ఇంత నీచంగా పడిపోయాయనుకోలేదంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.