![Jr NTR reaction on Chandrababu Tears](https://brighttelangana.com/wp-content/uploads/2021/11/Jr-NTR-reaction-on-Chandrababu-Tears.jpg)
ఆంధ్రప్రదేశ్ : జూనియర్ ఎన్టీఆర్ ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై స్పందించారు. తన మనోభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ఆయన ట్విటర్లో వీడియో రిలీజ్ చేశారు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన కలచివేసిందన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమని, విమర్శలు ప్రజాసమస్యలపైనే జరగాలన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు.
ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని ఎన్టీఆర్ అన్నారు. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుషపదజాలంతో మాట్లాడడం అరాచక పరిపాలనకు నాంది పలుకుతుందన్నారు. ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి అని చెప్పారు. ఇది మన రక్తంలో ఇమిడిపోయిన సంప్రదాయం అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. తాను ఒక కుటుంబసభ్యుడిగా మాట్లాడటం లేదని, ఒక కొడుకుగా, తండ్రిగా, భర్తగా, దేశ పౌరుడిగా ముఖ్యంగా తెలుగువాడిలా మాట్లాడుతున్నానని తెలిపారు. మన సంస్కృతిని కాల్చివేసేలా వ్యవహరించకూడదన్నారు. ఈ అరాచక సంస్కృతిని ఇంతటితో ఆపాలని పిలుపునిస్తూ రాజకీయ నాయకులకు ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.