![](https://brighttelangana.com/wp-content/uploads/2021/11/Allu-Arjun.jpg)
అల్లు అర్జున్, రాపిడో టాక్సీ సంస్థకు తెలంగాణ ఆర్టీసీ నోటీసులిచ్చింది. సంస్థ ప్రతిష్టను దిగజార్చేలా వాణిజ్య ప్రకటనలు ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. ఇరువురికి లీగల్ నోటీసులు పంపిన సజ్జనార్ ప్రజలకు మంచి చేసేలా వాణిజ్య ప్రకటనలు ఉండాలని సూచించారు. సాధారణ దోసలతో ఆర్టీసీ బస్సులను పోల్చడం సరికాదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీని కించపరిస్తే సంస్థ, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరు అని సజ్జనార్ తేల్చిచెప్పారు. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల హోదాలో ఉన్న నటీనటులు, సెలబ్రిటీలు, వివిధ రంగాల ప్రముఖులు ఇలాంటి యాడ్కు దూరంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
ఇంతకీ ఆ యాడ్లో ఏముందంటే..
ర్యాపిడో రూపొందించిన ఈ యాడ్లో అల్లు అర్జున్ దోసెలు వేస్తూ ‘అబ్బాయి .. దోసెలు తినాలంటే రెండే చోట్ల.. ఒకటి తన దగ్గర..రెండోది ఆ ఆర్టీసీ బస్సు రూట్లోనే’ అంటూ బస్సును చూపిస్తాడు. ఆతర్వాత ‘అక్కడ మామూలు దోసెలా ఎక్కినోన్ని కూడా కూర్మా, ఖైమా కొట్టి మసాలా దోసె చేసి దింపుతారు’ అంటూ ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో ప్రయాణం చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని అర్థం వచ్చేలా మాట్లాడతాడు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులను ఎక్కిన ప్రయాణికులను మసాలా దోసెలతో పోల్చడాన్ని తెలంగాణ ఆర్టీసీ(టీఎస్ఆర్టీసీ) తప్పుపట్టింది. ఈక్రమంలోనే అర్జున్తో పాటు ర్యాపిడోకు లీగల్ నోటీసులు పంపించారు ఎండీ సజ్జనార్.