![Chandrababu Announced 10 Lakh Ex Gratia](https://brighttelangana.com/wp-content/uploads/2022/12/Chandrababu-Announced-10-Lakh-Ex-Gratia.jpg)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరులో తన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో అపశృతి నెలకొంది. పామూరు రోడ్లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆయన ప్రసంగిస్తున్న సమయంలో.. సభలో గందరగోళం, తొక్కిసలాట చోటు చేసుకున్నాయి. భారీగా జనం తరలిరావడం వల్లే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 8 మంది కాలువలో పడి మృతి చెందగా.. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే కందుకూరి ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే చంద్రబాబు తన సభను మధ్యలోనే ఆపేసి, ఆసుపత్రికి వెళ్లారు. బాధితుల్ని పరామర్శించారు. మృతి చెందిన వారిని దేవినేని రవింద్ర (ఆత్మకూరు), కలవకురి యనాది (కొండమూడుసుపాలెం), యటగిరి విజయ (ఉలవపాడు), కకుమాను రాజా (కందుకూరు), మరలపాటి చిన కొండయ్య (గుళ్లపాలెం), పురుషోత్తం (కందుకూరు)గా గుర్తించారు.
ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొందరు నిండు ప్రాణాలు త్యాగం చేశారని చెబుతూ, తన సభను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని, కొన్ని సందర్భాల్లో మనం నిమిత్తమాత్రులం అవుతామని, విధిరాత ఇలా ఉందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. వారికి పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు.
కందుకూరుకి ఎప్పుడు వచ్చినా.. ఆసుపత్రి సెంటర్లోనే సభ పెడుతుంటామని, కానీ ఈసారి దురదృష్టకర ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభను కొనసాగించడం భావ్యం కాదన్నారు. దీన్ని సంతాప సభగా భావించి, మృతుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి, సభను అర్థాంతరంగా ముగించారు.